నిజమైన ధనవంతుడు.. పేద పిల్లల కోసం దినసరి కూలీ గొప్ప మనసు

ఇతరులకు సహాయం చేయాలంటే స్తోమతతో పనిలేదు.. మంచి మనసుంటే చాలు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ తాలుకాకు చెందిన ఆంజనేయ యాదవ్‌ అనే యువకుడు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాడు.
నిత్యం పాఠశాలకు 3 – 4 కిలోమీటర్లు నడిచివెళ్లే విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చాడు. రోజువారీ కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో రూ.40 వేలు పొదుపు చేసి విద్యార్థులకు సాయం చేశాడు. మల్కందిన్ని గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హైస్కూలు చదువుల కోసం సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్లాలి.


గ్రామ విద్యార్థులు రోజూ అంత దూరం నడిచి వెళ్లడాన్ని ఆంజనేయ యాదవ్‌ గమనించాడు. ”రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ పిల్లల చదువు అలా ఆగిపోకూడదని సైకిళ్లు పంపిణీ చేశాను” అని తెలిపాడు.