మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ సమయంలో ఆధార్ కార్డును ఎక్కువ మంది గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నారు.
కాగా, ఇప్పుడు ప్రయాణీకులకు సేవలను సౌకర్యవంతం చేసేందుకు వీలుగా బస్ పాస్ ల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చేయాలని ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఇదే రకమైన కార్డుల జారీ ద్వారా ఇక ఆధార్ కార్డులు అవసరం ఉండవని చెబుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్మార్ట్ కార్డులను వినియోగం లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. తొలి దశలో ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ లను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్మార్ట్ కార్డుల విధానాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పూర్తిగా ప్రయాణీకుల సమాచారం తో ఈ కార్డులను తయారు చేయనున్నారు. విద్యార్థుల తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విద్యార్థుల బస్ పాస్ ల సంఖ్య ఐదు లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ బస్ పాస్ లకు సంబంధిత బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్మార్ట్ కార్డు వినియోగంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణీకులకు గుర్తింపు కార్డుల అవసరం ఉండదు. అదే విధంగా మొబైల్ రీఛార్జీ చేసుకున్నంత సులువుగా స్మార్ట్ కార్డు బస్ పాస్ ను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందని అర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ముంబయి, లక్నో నగరాల్లోని బస్సుల్లో స్మార్ట్కార్డు విధానాల్లో ఎలాంటి ఫీచర్లు అమలు చేస్తున్నారనే అంశం పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలోనూ అమల్లోకి వస్తే ఏ దారిలో ఎంతమంది విద్యార్థులు ప్రయాణించే అవకాశం ఉంది.. ఎన్నిసార్లు బస్సు ఎక్కుతున్నారనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఇక.. ఇప్పుడు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలు ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. స్మార్ట్కార్డు అమలోకి వచ్చిన తర్వాత ఇక ఈ ఆధార్ అవసరం ఉండదు. ఈ స్మార్ట్ కార్డులు త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.
































