నాటి గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్‌.. గాంధారీ ఇచ్చిన శాపంతోనే ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉందా

www.mannamweb.com


మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్‌ అని చాలామంది అంటారు. దీనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాందహార్ అని పిలుస్తారు. ఈ పదం గాంధార నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘సువాసనల భూమి’. ఈ పదం ఋగ్వేదం, మహాభారతం, ఉత్తర-రామాయణం వంటి వివిధ పాత గ్రంథాల్లో ప్రస్తావించబడింది. సహస్రనామం ప్రకారం శివుని పేర్లలో గాంధారం ఒకటి. గాంధార మొదటి నివాసులు శివ భక్తులని కూడా నమ్ముతారు.

మహాభారతం- కాందహార్ మధ్య సంబంధం
గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, వాయువ్య పంజాబ్ ఉన్నాయి. మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం. ఇందులో కౌరవ, పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ. ఈ ఇతిహాసం ప్రకారం సుమారు 5500 సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబల రాజు పరిపాలించాడు. అతనికి గాంధారి, శకుని అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె గాంధారీకి హస్తినాపుర రాజ్యానికి యువరాజు అయిన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది.

గాంధారం కాందహార్ అయింది
మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే 100 మంది కుమారులు ఉన్నారు. వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు. కురు క్షేత్ర యుద్ధానంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా, ఇరాక్‌లకు వలస వెళ్లారు. గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్ గా మారింది. ఇది మాత్రమే కాదు చంద్రగుప్తుడు, అశోకుడు, టర్కీ విజేత తైమూర్ , మొఘల్ చక్రవర్తి బాబర్ లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయిందని చారిత్రిక కథనం.

ఆఫ్ఘనిస్తాన్‌పై గాంధారి శాపం ప్రభావం
పురాణాల కథల ప్రకారం కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. దీనితో పాటు గాంధారి తన సోదరుడు శకునిని కూడా శపించింది. ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శకుని కారణంగా భావించింది. తన 100 మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడు ఎవరూ శాశ్వతంగా నివసించరని.. ఇక్కడ శాంతి ఉండదు, ఎల్లప్పుడూ బాధలు పడతారని.. రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శాపాన్ని ఇచ్చింది.

అలా గర్భ శోకంతో గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారు. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత, అంతకు ముందు కూడా శాంతి లేదు. ఈ దేశాన్ని ఇప్పటి వరకూ ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్, గొడవలు లేకుండా జీవించలేదు. ఈ కారణాలన్నింటికీ కారణం గాంధారి శాప ప్రభావమేనని నమ్ముతారు.