తిరుమల భక్తులకు అలర్ట్.. మూడు రోజుల పాటు దర్శనాలు బంద్

కలియుగ వైకుంఠం తిరుమలలో త్వరలో జరగనున్న రథసప్తమి వేడుకల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పలు రకాల ప్రత్యేక దర్శనాలు మరియు సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


ఈ నెల 24 నుంచి 26 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంటుంది, సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

ఈ మూడు రోజుల పాటు టైమ్ స్లాట్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని నిలిపివేశారు.

రథసప్తమి రోజైన 25వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు.

సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్‌ఆర్‌ఐలకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

రథసప్తమి రోజున స్వామివారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

మాడ వీధులు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం నిరంతరం అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ చేయనున్నారు.

భక్తుల కోసం సుమారు 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా అందుబాటులో ఉంచారు.

తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తరహాలోనే రథసప్తమిని కూడా విజయవంతం చేయాలని, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.