భారత్ సహా వివిధ దేశాలకు అమెరికా చేస్తోన్న ఆర్థిక సహకారాన్ని నిలిపివేయడాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) సమర్థించుకుంది.
తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండింగ్ను ఆపివేయాల్సి వచ్చిందనీ వివరించింది.
భారత్ సహా..
భారత్ సహా మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులను ఇటీవలే రద్దు చేసింది డోజ్.
ఫాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూలో..
దీనిపై తాజాగా ఆ డిపార్ట్మెంట్ చీఫ్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై మాట్లాడారు. అమెరికా ఎదుర్కొంటోన్న ఆర్థికలోటు, నిరుద్యోగం, రాబడి- ఖర్చులు, ఉక్రెయిన్కు మిలియన్ డాలర్ల కొద్దీ ఆర్థిక ప్యాకేజీని అమలు చేయడం వంట అంశాలు ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చాయి.
ఆర్థిక లోటు రెండు ట్రిలియన్ డాలర్లు..
ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటోన్న ఆర్థిక లోటు రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఎలాన్ మస్క్ తెలిపారు. గతంలో ఎప్పుడేగానీ ఈ స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తలేదని అన్నారు. తక్షణమే డొనాల్డ్ ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే అమెరికా దివాళా తీస్తుందని హెచ్చరించారు.
సగటు పౌరుడు నరకాన్ని చవి చూసే పరిస్థితులు..
దేశంలో నివసించే ఓ సగటు పౌరుడు నరకాన్ని చవి చూసే పరిస్థితులు ఉత్పన్నమౌతాయని స్పష్టం చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మిషన్ను తప్పుపట్టారాయన. ఓ సగటు అమెరికన్ చెల్లించే పన్నులను ఇతర దేశాలకు చెల్లించడం సరికాదని, దీనివల్ల ట్యాక్స్ పేయర్ కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోవచ్చని, ఇది వారిలో ఆగ్రహం కలిగిస్తుందని అన్నారు.
అమెరికా దివాళా..
రెండు ట్రిలియన్ డాలర్ల లోటును నియంత్రణలోకి తీసుకురాకపోతే.. అమెరికా దివాళా తీస్తుందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. రాబడికి మించి ఎక్కువగా ఖర్చు చేస్తే ఒక వ్యక్తి అయినా, ఒక దేశం అయినా దివాళా తీయవచ్చని పేర్కొన్నారు.
డెమోక్రాట్లు ఎవరూ ఖర్చు చేయని విధంగా దుబారా..
జనవరి 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రెండు ట్రిలియన్ డాలర్ల లోటు ఉందని, ఇదివరకు అమెరికాను పాలించిన డెమోక్రాట్లు ఎవరూ ఖర్చు చేయని విధంగా దుబారా చేశారని విమర్శించారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్.. తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో ప్రభుత్వాన్ని డెమోక్రాట్లకు ఇచ్చారని గుర్తు చేశారు.
గ్రీన్ స్కామ్..
గత ప్రభుత్వ హయాంలో గ్రీన్ స్కామ్ చోటు చేసుకుందన, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. దీని వెనుక వందల బిలియన్ డాలర్లకు సమానమైన మోసం జరిగిందని అన్నారు. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు.