Andhra Pradesh : హ్యాపీ న్యూస్…ఇక వారికి కూడా పింఛన్లు… నెలకు నాలుగు వేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పింఛన్ల మంజూరు చేయడానికి ఒకే చెప్పేసింది. అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛనును మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


కొత్తగా మరో లక్ష మంది వరకూ పింఛన్లను మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి ఈ కొత్తగా మంజూరయిన పింఛనుదారులకు పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

మే నెల నుంచి…

అయితే వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయడం కష్టమని, మే నెల నుంచి విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన వారిని దాదాపు 93 వేల మంది కొత్త పింఛన్ల పంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులైన దాదాపు పథ్నాలుగు వేల మంది పింఛన్లను కూడా తొలగించారని చెబుతున్నారు. కొత్త గా మంజూరయిన పింఛన్లన్నీ దాదాపు వితంతు పింఛన్లేనని అధికారులు చెప్పారు. వీరికి నెలకు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది.

ఇప్పటికే దివ్యాంగులకు…

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛనుదారులు ఐదు లక్షల మంది వరకూ గుర్తించామని తెలిపారు. వీరికి కూడా త్వరలోనే పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దాదాపు 60 లక్షల మంది పింఛను దారులకు ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పింఛను మంజూరు చేస్తుంది. దివ్యాంగులకు ఆరువేల రూపాయల చొప్పున చెల్లిస్తుంది. పూర్తిగా మంచం మీద ఉండి చికిత్స పొందుతున్న వారికి నెలకు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తుంది. తాజాగా మరో ఐదు లక్షల మందికి అదనంగా పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.