కొత్తగా పెళ్లి చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం షాక్

ఆంధ్రప్రదేశ్‌లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ మ్యారేజ్ నమోదు ఫీజు రూ.200 ఉండగా రూ.500కు పెంచింది. పెళ్లి వేదిక వద్దకే సబ్ రిజిస్ట్రార్ వస్తే ఫీజును రూ.5,000 (గతంలో రూ.210) చేసింది. ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును రూ.5,000గా నిర్ణయించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి రూ.100కు పెంచింది.


వివాహ రిజిస్టేషన్లు మరింత సులభతరం అయ్యాయి. ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్‌ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవాళ్లు సబ్‌ రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లి సంబంధిత ఫామ్‌ పూర్తి చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్‌ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజిస్టర్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.