తాజాగా మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!

Andhra Pradesh: తాజాగా మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం!


రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం జరిగే సెక్యూరిటీ వేలంలో పాల్గొననుంది. 18, 20, 22, 25 ఏళ్ల కాల పరిమితితో తీర్చేలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఈ మొత్తాన్ని సేకరించనుంది. దీంతో కలిపితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.25 వేల కోట్లు అప్పులు చేసినట్టు లెక్క. ఈ నిధులు బుధవారం ప్రభుత్వ ఖజానాకు జమ కానున్నాయి.

సొంత గుత్తేదార్లకు చెల్లించేందుకే: జీవీ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి తాజాగా సేకరిస్తున్న రూ.4 వేల కోట్ల రుణాన్ని తన అనుకూల గుత్తేదార్లకు చెల్లించాలని యోచిస్తోందని తెదేపా నాయకుడు జీవీ రెడ్డి ఆరోపించారు. ‘సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలోనే ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి మరో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంటోంది. ఈ సొమ్మును వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు బదలాయించనుంది’ అని ఆరోపించారు.