AP Government: అంగన్వాడీలకు షాక్‌.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..!

AP Government: అంగన్వాడీల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. ఓ వైపు సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు.. ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో…
వారిపై చర్యలకు సిద్ధం అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆర్డర్స్‌ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకు షాక్‌ ఇచ్చారు కలెక్టర్‌.. ఎస్మా ఉల్లంఘనకు పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ప్రభుత్వం హెచ్చరికలతో విధుల్లో చేరారు 69 మంది వర్కర్లు, 42మంది ఆయాలు.. అయితే, జిల్లాలో మొత్తం అంగన్వాడీలు 752 మంది, ఆయాలు 698 మంది ఉన్నారు. వీరిని వెంటనే తొలగించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్.. మరోవైపు.. కొత్త అంగన్వాడీల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు.
మరోవైపు. పార్వతీపురం మన్యం జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచిచూశాం.. నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.. అంతేకాకుండా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని.. జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, సాధికారిత అధికారి ఎం ఎన్ రాణి తెలిపారు. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక, విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కూడా అంగన్వాడీ కార్యకర్తలకు నేటి నుంచి విధుల నుంచి తొలగిస్తున్న ఉత్తర్వులు జారీ చేశారు.. విజయనగరం జిల్లా పరిధిలో 4151 అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాల్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొంటున్నారు.. నిబంధనల ప్రకారం వారికి నోటీసులు జారీ చేశాం.. అయితే, ఇవాళ్టి వరకు జిల్లాలో 503 మంది విధుల్లో చేశారు.. సోమవారం ఉదయం 9:30 గంటల వరకు కూడా తిరిగి విధులకు హాజరు కావడానికి అవకాశం కల్పించడం జరిగింది.. అలాంటి వారు మినహా ఇంకా విధుల్లో చేరని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.