వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం (Lquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ( Special Investigation Team)ను ఏర్పాటు చేసింది.
సిట్ అధిపతిగా విజయవాడ సీపీ రాజశేఖర బాబు (CP Rajasekhar Babu)ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్.శ్రీహరిబాబు, డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు కె.శివాజీ, సీహెచ్.నాగ శ్రీనివాస్ను నియమించింది.
2019-24 మధ్య జగన్ సర్కారులో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలపై గతంలో ఏపీ సీఐడీ(AP CIP) కేసు నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిట్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు పంపారు. డీజీపీ ప్రతిపాదనల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిట్ అధికారులు అడిగిన నివేదికను ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు పురోగతిపై విచారణ నివేదిక ఇవ్వాలని సిట్ను సైతం ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి సీఐడీ డీజీ ద్వారా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

































