AP News: నాలుగునరేళ్ల తర్వాత సరిగ్గా ఒకటో తేదీనే జీతాలు.. ఆశ్చర్యంలో ఉద్యోగులు!

అమరావతి, జూలై 1: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు (AP Government Employees) జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు.


ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యేది. గత నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1న తారీఖున జీతాలు పడతాయా? లేదా? అనే సందేహాలన్నింటికి కూడా సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే (జులై 1) ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది.

దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్లలో శాలరీలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్స్‌కు బ్యాంక్ మెసేజ్‌లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎఫ్.ఎం.యస్‌లో గ్రీన్ ఛానల్‌లో పెన్షన్ బిల్లులు పెట్టారు.

నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.5500 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుందరి. ఈ మొత్తం లేక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పు తిప్పులు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్ధిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాజిక భద్రతా పెన్షన్లకు రూ.4వేల కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఒకటో తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపు ప్రారంభం అయ్యాయి. సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.