ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా 2024 ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించారు.
అర్హులైన కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏటా మూడు సిలిండర్లు అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులే తొలుత గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన ఒకటి నుంచి రెండు రోజుల్లోగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ చేస్తూ వస్తోంది.
దీపం -2 పథకం కింద 2024 డిసెంబర్ నెలలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభించారు. 2025 మార్చి 31వ తేదీ వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి అవకాశం కల్పించారు. 2025 ఏప్రిల్ నుంచి 2025 జులై 31 వరకూ రెండో ఉచిత సిలిండర్ అందించారు. ఇక మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ను 2025 ఆగస్ట్ నుంచి నవంబరు వరకు పంపిణీ చేస్తున్నారు. అయితే గ్యాస్ డబ్బులు అకౌంట్లలో జమయ్యే విషయంలో, గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో.. మొదటి, రెండో విడతతో పోలీస్తే మూడో విడత దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
సిలిండర్ తీసుకున్నప్పటికీ గ్యాస్ డబ్బులు అకౌంట్లలో పడటం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారుగా లక్షా 26 వేల మంది లబ్ధిదారులకు డబ్బులు పడాల్సి ఉందని లెక్కలు చెప్తున్నాయి. సుమారుగా 18 కోట్ల 80 లక్షల రూపాయలు గ్యాస్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉందని సమాచారం. మరోవైపు అర్హులు అందరికీ గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు అకౌంట్లలో జమ కాకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయం, ఎంపీడీవో ఆఫీస్, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసే వీలుంది. అలాగే1967 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్ ఈకేవైసీ సమస్య ఉంటే సంబంధిత ఏజెన్సీని కలవాలని అధికారులు సూచిస్తున్నారు.

































