ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు, రేషన్ పంపిణీలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది.
క్యూఆర్ కోడ్తో కూడిన ఈ రేషన్ కార్డులను ఉచితంగా గత కొద్ది నెలల నుంచి పంపిణీ చేస్తోంది. అయితే కొంతమంది ఈ కార్డులను ఇంకా తీసుకోలేదు. ఆగస్టు నుంచి కార్డులను ఏపీ ప్రభుత్వం ఇస్తుండగా.. ఇప్పటికీ చాలామంది తీసుకోలేదు. కేవలం వృద్దులు, వికలాంగులకు మాత్రమే రేషన్ డీలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్లి ఇస్తున్నారు.
ఇప్పటికీ స్మార్ట్ కార్డులను తీసుకోనివారికి ప్రభుత్వం తుది అవకాశం కల్పించింది. డిసెంబరు 15లోపు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. లేకపోతే ఆ తర్వాత రూ.200 రుసుం చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్రజలు ఎవరు కార్డులను రద్దు చేస్తారన్న ఆందోళన అవసరం లేదు. దగ్గర్లోని సచివాలయాల్లో రూ.200 రుసుం చెల్లించి చిరునామాతో సహా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదరు చిరునామాకు కమిషనరేట్ నుంచి నేరుగా లబ్ధిదారుకు స్మార్ట్ కార్డు పంపుతారు. సచివాలయ అధికారులకు రేషన్ కార్డుదారులకు ఫోన్ చేసి స్మార్ట్ కార్డులు తీసుకోవాలని, లేకపోతే వెనక్కి పంపిస్తామని సమాచారం అందిస్తున్నారు. కొంతమంది ఫోన్ కాల్స్కు అందుబాటులో లేకపోగా.. మరికొంతమంది కాల్ చేసి చెప్పినా తీసుకుని వెళ్లడం లేదు. దీంతో అధికారులు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఆ లోపు వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పేదలకు రేషన్ సరకులు అందిస్తోంది. అక్రమాలకు కళ్లెం వేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను కొత్తగా రూపొందించింది. వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించింది. అక్కడి అధికారులు వీటిని లబ్దిదారులకు అందజేస్తున్నారు. క్యూఆర్ కోడ్తో తీసుకొచ్చిన ఈ స్మార్ట రేషన్ కార్డులు ఏటీఎం సైజు తరహాలో ఉంటాయి. వీటిపై కుటుంబసభ్యుల పేర్లు, రేషన్ నెంబర్ ఉంటుంది.































