తెలంగాణలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల మహిళలకు ఉచిత చీరలు అందించే పథకంపై ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నవంబర్ 15 నాటికి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీకి సిద్దం చేయాలని వ్యవసాయ, చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం రోజున రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళిశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… గతంలో (బీఆర్ఎస్ హయాంలో చీలర పంపిణీ) నాణ్యత విషయంలో విమర్శలు నేపథ్యంలో, చేనేత కార్మికులతో ప్రత్యేకంగా నాణ్యతతో కూడిన చీరలను ఉత్పత్తి చేయిస్తున్నట్టుగా తెలిపారు.
మహిళల కోసం 6.5 మీటర్ల చీరలు, వృద్ధుల కోసం తొమ్మిది మీటర్ల చీరలు రూపొందించామన్నారు. చీరల తయారీలో దాదాపు 6,500 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి లభించిందని తెలిపారు. అలాగే చేనేత రంగానికి ప్రోత్సహం లభించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 64.69 లక్షల చీరలను సిద్దం చేయాలని చెప్పారు. ఇప్పటికే 33.35 లక్షల చీరలను ఉత్పత్తి చేసి జిల్లా గోదాములకు పంపించామని… వచ్చే నెల 15 నాటికి మిగిలినవి కూడా పూర్తి చేసి గోదాములకు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సందర్భంగా రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల ఎంపిక ప్రక్రియ వెంటనే పూర్తి చేసి వారి ఖాతాల్లో నిధులను జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేతన్న భరోసా పథకం కింద ఈ ఏడాది రూ. 48.80 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పథకంలో చేనేత కార్మికులకు రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేలు చొప్పున ఏడాదికి రెండు విడతల్లో ప్రోత్సాహకం అందిస్తామని తుమ్మల వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు చేసే వస్త్రాలు కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్లు టెస్కో నుంచే తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి తరలించే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు.
ఇందిరా మహిళా శక్తి కింద చీరల పంపిణీ…
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బతుకమ్మకు తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళలు చీరలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2023 వరకు ఈ పథకం కొనసాగింది. అయితే 2023 డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం… ఈ పథకాన్ని కొనసాగించలేదు. దీంతో గతేడాది బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ జరగలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం… మహిళా సమాఖ్య సభ్యులకు ఇక నుంచి ప్రతి ఏడాది రెండు చీరలు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరల నాణ్యతపై వచ్చిన విమర్శలను, ఆరోపణలను ప్రస్తావించారు.
గత బీఆర్ఎస్ నాణ్యతలేని చీరలు ఇచ్చారని, తాము మాత్రం సొంత ఆడపడుచు పండుగపూట ఇంటికి వస్తే ఎలాంటి మంచి చీరను పెడతామో అలాంటి నాణ్యతతో కూడిన చీరలను ఇస్తామని కూడా ప్రకటించారు. ”ఇందిరమ్మ చీరలు” పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 65 లక్షల మంది మహిళలకు చీరలను అందించాలని చూస్తోంది. అయితే ఈ ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఈ చీరలను పంపిణీ చేయనుందనే వార్తలు వచ్చాయి. అయితే బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ జరగలేదు.
































