రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. ఈసారి వారికి మాత్రమే డబ్బులు

తెలంగాణలో యాసంగి సీజన్.. వ్యవసాయ పనులు మొదలయ్యాయి. వానాకాలం పంటలు పూర్తి కావడంతో.. రైతులు యాసంగి సాగుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం అందించే సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు.


అయితే, రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. ఈసారి సాగు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అంటే రైతులు సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని అమలు చేయబోతుంది.

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ చేసేందుకు గాను..శాటిలైట్ ఇమేజరీ ఆధారిత సాంకేతిక వ్యవస్థ(శాటిలైట్స్ ద్వారా తీసిన ఫోటోలు, వీడియోల ద్వారా భూమిని కొలిచే సాంకేతికత)ను అమల్లోకి తీసుకు రావాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా లెక్కించిన తర్వాతే.. రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. దీనిపై చర్చించేందుకు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సంబంధిత వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో శాటిలైట్ ఫొటోలు, వీడియోల ద్వారా సాగు విస్తీర్ణాన్ని గుర్తించి అంచనా వేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల యాసంగి సీజన్ రైతు భరోసా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం గత వానాకాలం సీజన్ నుంచే శాటిలైట్ ఆధారంగా రైతులకు రైతు భరోసా పథకాన్ని అందించాలని నిర్ణయించాలని భావించినా.. అది సాధ్యపడలేదు. దాంతో యాసంగి సీజన్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా.. కేవలం సాగుచేసిన రైతులకే నిధులు అందించేందుకు గాను ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించబోతుంది.

బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల.. శాటిలైట్ మ్యాపింగ్ అంశంతో పాటుగా పత్తి కొనుగోళ్లు, యూరియా సరఫరా, గత రబీ జొన్న నిల్వల అంశాలపై ప్రధానంగా చర్చించారు. రానున్న యాసంగి సీజన్‌కు సరిపడా మొత్తం 6 లక్షల టన్నులు యూరియా కావాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 3.05 లక్షల టన్నుల యూరియా వచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభమైన నేపథ్యంలో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని.. స్లాట్ బుకింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.