శ్రీదేవి ఆస్తి.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్‌

తన భార్య, దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్‌ కోర్టును ఆశ్రయించారు. వారు చట్టవిరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు.


ఆమె (Sridevi) ఎంతో కష్టపడి ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిందని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దాని వివరాలను కోర్టుకు వివరించారు.

1988 ఏప్రిల్‌లో శ్రీదేవి మద్రాసులో ఎంసీ సంబంద మొదలియార్‌ అనే వ్యక్తి వద్ద స్థిరాస్తిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన తర్వాతే ఆమె దాన్ని కొనుగోలు చేసినట్లు బోనీ కపూర్‌ (Boney Kapoor) తెలిపారు. అతడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు బోనీ కపూర్‌ వెల్లడించారు. అయితే, ఎంసీ సంబంద మొదలియార్‌ రెండో భార్య కుమారులు ఈ ఆస్తిలో వారికి వాటా ఉందంటూ తహశీల్దార్‌ కార్యాలయంలో అప్పీల్‌ చేశారన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కులను సొంతం చేసుకున్నారని బోనీ కపూర్‌ హైకోర్టులో కేసు వేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన భార్య బతికి ఉండగానే మొదలియార్‌ రెండో వివాహం చేసుకున్నారన్న విషయాన్నీ బోనీ కపూర్‌ ప్రస్తావించారు. విచారించిన జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని.. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్‌ను ఆదేశించారు.

1996లో బోనీ కపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు (జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌). 2018లో శ్రీదేవి మరణించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.