బాలీవుడ్ నటులకు పాకిస్తాన్ షాక్

బాలీవుడ్ కమెడియన్ కింగ్ కపిల్ శర్మకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్ ద్వారా కపిల్ శర్మను చంపేస్తామని కొందరు దుండగులు బెదిరించారు . కపిల్తో పాటుగా రాజ్పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, గాయకుడు సుగంధ మిశ్రాలకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.


అయితే వీరిందరికీ పాకిస్థాన్ నుంచి ఈ మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం, విష్ణు అనే వ్యక్తి నుండి ఈ మెయిల్స్ వచ్చాయి. కపిల్ శర్మ కార్యకలాపాలపై నిఘా ఉంచామని, దానిని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈమెయిల్లో రాశారు.

దీనిపై రాజ్పాల్ యాదవ్ భార్య రాధా రాజ్పాల్ యాదవ్ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు రెమో డిసౌజా, సుగంధ మిశ్రాకు వేర్వేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై కత్తి దాడిమరవకు ముందే బాలీవుడ్ నటులకు ఇలాంటి హత్య బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. పలువురు సెలబ్రిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసులను సీరియస్గా విచారిస్తున్నారు. మరోవైపు మహాసర్కార్ కూడా శాంతిభద్రతలపై గట్టిగానే ఫోకస్ చేసింది.

సైఫ్ పై కత్తితో దాడి

సైఫ్ అలీఖాన్పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న బాంద్రాలోని తన ఇంటిలో చోరీకి ప్రయత్నించిన ఓ అగంతకున్ని సైఫ్ అలీఖాన్ అడ్డుకున్నాడు. దీంతో అగంతకుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్కు ఆరు కత్తిపోట్లు పడ్డాయి. గాయాలతో ఉన్న సైఫ్ను తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటోరిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతనికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)ని ముంబై పోలీసులు ఆదివారం థానేలో అరెస్టు చేశారు.