ఫాస్టాగ్‌కు బైబై.. ఇకపై కొత్త పద్ధతిలో టోల్ వసూలు.. అంతా ఆటోమేటిక్

www.mannamweb.com


జాతీయ రహదారులకు సంబంధించిన కీలకమైన అప్ డేట్ ఒకటి కొన్ని రోజులుగా చర్చల్లో ఉంది. అది టోల్ చార్జీలకు సంబంధించిన అంశం. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మార్చాలని కేంద్రం చూస్తోందని చాలా కాలంగా పుకార్లు వస్తున్నాయి.

ఇది వాస్తవమేనని ఇప్పుడు తెలుస్తోంది. దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్ధారించారు. త్వరలో జాతీయ రహదారులపై శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకురానున్నట్లు ప్రకటించారు. సులభమైన ట్రాఫిక్ నియంత్రణ, టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా దీనిని అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఇది కొత్త వ్యవస్థ..

హైవేలపై టోల్ సిస్టమ్ కొత్త రూపులోకి వస్తోంది. ఉపగ్రహ ఆధారిత వ్యవస్థను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ వాహనాలు ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా టోల్ చార్జీలను ఆటోమేటిక్ గా మినహాయించుకునే విధంగా ఈ శాటిలైట్ ఆధారిత వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇది తక్కువ దూరాలలో ఎక్కువ టోల్ బూత్ ల కారణంగా ఎక్కువ చెల్లించే అవసరాన్ని తగ్గిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త వ్యవస్థ పేరు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్). ఇది ప్రస్తుతం ఉన్న ఫాప్ట్యగ్ సిస్టమ్ కు అప్ డేటెడ్ వెర్షన్. ఈ జీఎన్ఎస్ఎస్ GNSS స్వయంచాలకంగా పనిచేస్తుంది.

టోల్ గేట్లకు చెల్లు చీటి..

ఈ జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ సంప్రదాయ టోల్ బూత్ల అవసరాన్ని తొలగిస్తుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. పొడవైన క్యూలను తొలగించడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి (ఎన్హెచ్-275), హరియానాలోని పానిపట్ – హిసార్ జాతీయ రహదారి (ఎన్హెచ్-709)లో ఉపగ్రహ ఆధారిత వ్యవస్థను పరీక్షిస్తున్నారు.
అక్కడ లోట్లుపాట్లను తినిఖీ చేసి, నిర్ధారించిన తర్వాత జీఎన్ఎస్ఎస్ టోల్ సేకరణ వ్యవస్థ దశలవారీగా ప్రారంభమవుతుంది. దేశంలోని కీలక నగరాలను అనుసంధానించే ప్రధాన రహదారులను తొలి దశలో కవర్ చేస్తుంది.

ప్రత్యేక సమావేశం..

ఎన్హెచ్ఏఐ అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) ఇటీవల భారతదేశంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ను విడుదల చేయడం గురించి చర్చించడానికి అంతర్జాతీయ వర్క్ షాప్ను నిర్వహించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు పాల్గొన్నారు. యూఎస్, యూరప్ నుంచి పరిశ్రమ నిపుణులు వర్క్ షాప్ నకు హాజరయ్యారు.