అవకాశాలు అందుకోవాల్సిందే.. వారసత్వంతో కాదు.. లోకేష్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏ రంగంలోనైనా వారసత్వం మిథ్యేనని, నారా లోకేష్‌కు వ్యాపారాలు చేయడమే సులువని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సుల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.


ఏపీలో నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అవకాశాలను అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలోనైనా రాణిస్తారని, లోకేశ్‌కు వ్యాపారాలు చేయడం సులువైనా ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు. కేంద్ర మంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏ రంగంలోనైనా వారసత్వం అనేది మిథ్య అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. లోకేశ్ వారసత్వంపై అడిగిన ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు ‘చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరన్నారు. జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు చెప్పారు.

30 ఏళ్ల క్రితమే కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. వ్యాపారాలను చూసుకోవడం లోకేశ్‌కు తేలికగా ఉంటుందని, ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. లోకేశ్‌ అందులో సంతృప్తి పొందుతు న్నారని ఈ విషయంలో రాజకీయ వారసత్వమంటూ ఏమీ లేదన్నారు’

దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ పెవిలియన్‌కు బ్రాండింగ్‌ ప్రమోషన్‌ చేస్తున్న జాతీయ మీడియా సంస్థలతో చంద్రబాబు మాట్లాడారు. ఇటీవల నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కక్షసాధింపు చర్యలు ఉండవు…

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసిన తర్వాతే చట్టప రంగానే చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కక్షసాధింపు చర్యలేవీ ఉండవని ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టప రంగానే వ్యవహరిస్తామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని చెప్పారు.

గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఐదుసార్లు గెలవడం వల్ల అక్కడ అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగాయన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అయ్యారని నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని బాబు చెప్పారు. సుస్ధిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నానని వారు కూడా వాస్తవాలు తెలుసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో 93% స్థానాలతో గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజలు విజయాన్ని అందించారని దానిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నామని చెప్పారు.

జాతీయ రాజకీయాలపై…

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, కేంద్రమంత్రి అవ్వాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన విద్వంసాన్ని చూసి ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టు కున్నారని ఏపీ పునర్నిర్మాణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా సాయం అందిస్తోందని చెప్పారు. జగన్‌ ప్రజల్ని ఒక్కసారి మాత్రమే మోసం చేయగలిగాడని, ఎప్పుడూ చేయలేడన్నారు. అదానీ విద్యుత్తు కాంట్రాక్టులపై అక్రమాలపై స్పందించిన బాబు ఆ వ్యవహారం అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉందని, దానిపై ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.