Central Government: రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. వచ్చే నెల నుంచే.. ప్రతీఒక్క రైతుకు బెనిఫిట్

రైతలుకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించనుంది. త్వరలో పార్లమెంట్‌లో కొత్త విత్తన చట్టాన్ని ఆమోదించనుంది. ఇప్పటికే బిల్లు రెడీ అవ్వగా.. త్వరలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం పార్లమెంట్‌లో ఆమెదించి అమల్లోకి తీసుకురానుంది. ఈ బిల్లు వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.


రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకురానుంది. ఈ బిల్లుతో నికిలీ విత్తనాల సరఫరా, పంపిణీకి అడ్డుకట్ట పడనుండగా.. అలాంటి నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్షలు, భారీగా జరిమానా విధించనున్నారు. ఇప్పటివరకు ఇలాంటి అక్రమాలకు పాల్పడినవారికి చట్టాలు కఠినంగా లేవు. దీంతో వారికి శిక్షలు పడటం లేదు. కేంద్రం కొత్తగా తీసుకురానున్న చట్టంతో వారికి భారీగా జరిమానా పడటంతో పాటు రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోవడం తగ్గుతుంది. ఈ కొత్త బిల్లు ఏంటి..? ఏయే అంశాలు ఉంటాయి..? రైతులకు ఎలాంటి లాభం జరగనుంది? అనే విషయాలు చూద్దాం.

కొత్త విత్తన చట్టం త్వరలోనే అమలు..
మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్త విత్తన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం ఏ క్షణమైనా వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ పంపనుంది. బిల్లుకు సంబంధించి చట్టపరమైన పరిశీలన ప్రక్రియ, సంప్రదింపులు ఇప్పటికే పూర్తవ్వగా.. త్వరలోనే బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత బిల్లును మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. కొత్త బిల్లును ప్రవేశపెట్టడానికి 2004 నుంచి రాజ్యసభలో ఉన్న పాత విత్తన బిల్లును కేంద్రం ఇప్పటికే వెనక్కి తీసుకుంది. గత ఏడాది నవంబర్‌లో వ్యవసాయ మంత్రిత్వశాఖ విత్తనాల బిల్లు-2025 ముసాయిదాను విడుదల చేసి అభిప్రాయాలు సేకరించింది.

రూ.30 లక్షలు జరిమానా
ఆరు దశాబ్దాల క్రితం విత్తనాల చట్టం,1966 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం స్థానంలో కొత్త విత్తన చట్టాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మేవారికి రూ.30 లక్షల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంటుంది. అలాగే కొత్త విత్తన రకాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదుకాని విత్తనాలు అమ్మినా జరిమానా, జైలుశిక్ష విధిస్తారు. ప్రస్తుతం ఉన్న చట్టం నోటిఫైడ్ రకాలు, విత్తనాలను మాత్రమే నియంత్రిస్తుంది. పరిశోధన హైబ్రిడ్ రకాలు, నోటిఫై చేయని రకాలను నియంత్రించడానికి నిబంధన లేదు. ఇక పచ్చి ఎరువు విత్తనాలు, వాణిజ్య తోటలు, తోటల పంటలు ప్రస్తుత చట్టం పరిధిలో లేవు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం నేరాలు, జరిమానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు లబ్ది చేకూర్చేందుకు కొత్త విత్తన చట్టాన్ని కేంద్ర అమల్లోకి తీసుకురానుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.