ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… దరఖాస్తుకు ఈ నెల 18 లాస్ట్ డేట్

కేంద్ర ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ -కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2025 (SSC CHSL 2025 Notification) నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే.


ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. అయితే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. అయితే ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎల్ నోటిఫికేషన్, పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం… తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పోస్టులు…
SSC CHSL 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,131 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు… వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో ఉన్నాయి. పోస్టుల విషయానికి వస్తే… లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) ఉన్నాయి.

దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు?
ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన బోర్డు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు సడలింపులు వర్తిస్తాయి. ఈ సడలింపులు గరిష్ట వయసుపై… ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 15 ఏళ్లుగా ఉంది.

దరఖాస్తు విధానం…
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు సమర్పించాలి. ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఇప్పటివరకు ఎస్‌ఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయని వారు… ముందుగా దానికి క్రియేట్ చేసుకోవాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా అకౌంట్‌ను యాక్సెస్ చేసుకుని ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల కోసం దరఖాస్తు సమర్పించాలి. అప్లికేషన్‌లో అడిగిన వివరాలను ఫిల్ చేయడంతో పాటు, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు… జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 100 ఉండగా, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/మాజీ సైనికుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం…
ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్ ఎంపిక ప్రక్రియలో ముందుగా టైర్ -1 పరీక్షను సీబీటీ మోడ్‌లో నిర్వహిస్తారు. టైర్ -1 పరీక్షలో సమయం 60 నిమిషాలు కాగా… జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు (50 మార్కులు),
జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు (50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు (50 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు (50 మార్కులు) ఉంటాయి. టైర్ 1 పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు టైర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఇది కూడా సీబీటీ మోడ్‌లోనే ఉంటుంది. టైర్‌ 2 క్వాలిఫై అయితే… దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌ను బట్టి నైపుణ్య పరీక్ష ఉంటుంది.ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు…
దరఖాస్తు ప్రారంభం – 2025 జూన్ 23
దరఖాస్తుకు చివరి తేదీ – 205 జూలై 18
దరఖాస్తు సవరణ తేదీలు – 2025 జూలై 23- 24
టైర్‌-1 పరీక్ష తేదీలు – 2025 సెప్టెంబర్ 8-18
టైర్‌-2 పరీక్ష తేదీలు – 2026 ఫిబ్రవరి, మార్చి

SSC CHSL 2025 నోటిఫికేషన్ పీడీఎఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో దరఖాస్తుదారుల అర్హత, రిజర్వేషన్ నియమాలు, పరీక్ష సిలబస్, ఇతర ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా దరఖాస్తును సమర్పించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.