కేంద్రం స్కీమ్.. పేదల సొంతింటి కల సాకారం.. రూ.1.5 లక్షల సాయం.. తక్కువ వడ్డీకే రుణాలు

www.mannamweb.com


భారత్‌లో పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో NDA నేతృత్వంలోని ప్రభుత్వం 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఈ స్కీమ్ కింద పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు కేంద్రం సాయం లేదా సబ్సిడీ ఇస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోనే జమ చేస్తుంది. ఇక ఇటీవల పట్టణాల్లో నివసించే పేద, మధ్య తరగతి ప్రజల కోసం సహేతుకమైన ధరల్లో ఇల్లు నిర్మించుకోవడం లేదా కొనేందుకు లేదా సరైన ఇంటిని అద్దెకు తీసుకునేందుకు .. ఆర్థిక సాయం సహా ఇంకా సబ్సిడీకే లోన్లు అందించేందుకు తెచ్చిన పథకం పీఎం ఆవాస్ యోజన 2.O. ఇటీవల 2024-25 బడ్జెట్‌లో దీనికి సంబంధించి రూ. 10 లక్షల కోట్లు కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లు నిర్మించేందుకు సంకల్పించింది. ఈ స్కీమ్ వివరాల్ని చూద్దాం.

ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి, SC/ST, వితంతు, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు సహా సమాజంలో వెనుకబడిన, అట్టుడుగు వర్గాల వారి కోసం ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. వీధి వ్యాపారులు, చేతి వృత్తుల వారు, అంగన్ వాడీ వర్కర్స్ వంటి వారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇప్పటికే సొంత ఇల్లు ఉన్న వారికి స్కీమ్ వర్తించదు. మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పొచ్చు. వారే యజమానులుగా ఉంటే త్వరగా ఆమోదం లభిస్తుంది.

దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా భారతీయులై ఉండాలి. పెళ్లయిన పిల్లలు ఉంటే కూడా అనర్హులు. భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గృహ నిర్మాణ పథకం నుంచి ప్రయోజనం పొంది ఉండొద్దు. ఇక లబ్ధిదారుడు.. ఆర్థిక వెనుకబడిన వర్గానికి చెందినవారైతే (EWS) వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు దాటకూడదు. అల్పాదాయ వర్గాలు (LIG) అయితే రూ. 3- 6 లక్షల్లోపు ఉండాలి. మధ్యస్థాయి ఆదాయ వర్గం- MIG-I అయితే రూ. 6-12 లక్షలు, MIG- II అయితే రూ. 12-18 లక్షల వరకు ఉండొచ్చు.

>> EWS కేటగిరీ కింద వారికి సొంత స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం వస్తుంది. భూమి లేకుంటే ఎక్కడో చోట భూమి ఇస్తుంది. వీరికి రూ. 1.50 లక్షలు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. ఇక మిగతా డబ్బు సబ్సిడీ కింద బ్యాంక్ లోన్ వస్తుంది. MIG- I వారికి రూ. 9 లక్షల లోన్ వరకు 4 శాతం సబ్సిడీతో లోన్ పొందొచ్చు. MIG-II వారికి రూ. 12 లక్షల లోన్ వరకు 3 శాతం సబ్సిడీ వస్తుంది. EWS/LIG వర్గం వారు రూ. 6 లక్షల వరకు లోన్‌పై 6.50 శాతం సబ్సిడీ పొందొచ్చు.

>> ఈ స్కీంలో చేరేందుకు ఆధార్ కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలి. ముందుగా పీఎం ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా సమీపంలోని మీ సేవా కేంద్రాల్లోకి లేదా కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.