ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌పై సీఈవో మీనా కీలక ప్రకటన

అమరాతి: మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ఈ రోజు (సోమవారం) ఆంధప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమాన్ మీనా (Mukesh Kumar Meena) కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందని ప్రకటించారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఫలితాలపై ఓ అంచనా వస్తుందని ఆయన అంచనా వేశారు.

ఓటేసిన 3.33 కోట్ల మంది..

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని చెప్పారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని, మరో 26,721 మంది సర్వీసు ఓటర్‌లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని చెప్పారు.

119 మంది అబ్జర్వర్లను నియమించిన ఈసీ

అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల లోక్‌సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రత్యేకంగా జరుగుతుందని, వేరే హాల్‌లో అక్కడ 8 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలు అవుతుందని వివరించారుు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 119 మంది అబ్జర్వర్లను నియమించిందని పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్లు 102 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1 నుంచి 2 రౌండ్‌లలో లెక్కిస్తారని, 48 నియోజకవర్గాలలో 3 రౌండ్‌లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్‌లలో లెక్కిస్తారని చెప్పారు. ఇక ఏపీలో జనవరి 1 నుంచి జూన్ 2 వరకు మొత్తం రూ.483.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.170 కోట్లు నగదు, 62 కోట్ల విలువైన లిక్కర్, రూ.36 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186 కోట్ల విలువైన వస్తువులు, రూ.29 కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఉన్నాయని తెలిపారు.

అమలాపురం పార్లమెంట్‌కు 27 రౌండ్‌లు
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ లెక్కింపునకు మొత్తం 27 రౌండ్‌లు పడుతుందని ముకేశ్ కుమార్ మీనా వివరించారు. ఫలితానికి దాదాపు 9 గంటల సమయం పట్టొచ్చని అన్నారు. ఇక రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాలలో 13 రౌండ్‌లు ఉంటాయని, ఇందుకు 5 గంటల సమయం పడుతుందని అన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలలో 26 రౌండ్‌ల లెక్కింపు జరుగుతుందని, కొవ్వూరు, నరసాపురంలలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.

పటిష్ట భద్రత ఏర్పాటు
అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చని, కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రమే నిర్దేశించిన సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లవచ్చునని పేర్కొన్నారు.

మద్యం ఎక్కడా దొరకదు..
కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు ముసివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం విక్రయాలు జరగబోవని స్పష్టం చేశారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
67 కంపెనీల సాయుధ భద్రతా బలగాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో రెడ్‌ జోన్‌గా ప్రకటించామని వివరించారు. కౌంటింగ్ రోజు జరిగిన హింస జరగకుండా చర్యలు చేపట్టామని, 185 హింస జరిగే ప్రాంతాల్లో గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామని ముకేశ్ కుమార్ మీనా వివరించారు.
12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశామని చెప్పారు. అలాగే పోలీసు పికెట్‌లు పెట్టామని ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. ఇక క్యూఆర్టి టీమ్‌లు, కార్డెన్ సెర్చ్ చేస్తున్నామని వివరించారు. పోలింగ్ తర్వాత 1,400 చోట్ల కర్డెన్ సెర్చ్ చేశామని అన్నారు.