Chandrababu: నాడు నో అపాయిట్మెంట్.. నేడు మోదీ పక్కనే చంద్రబాబు!

అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..! ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ.. అభివృద్ధి, ఐటీ టక్కున గుర్తొచ్చే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)..!


ఇదీ అసలు కథ..!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి గ్రాండ్ వెల్‌కమ్ అందినది. అంతేకాదు.. నరేంద్ర మోదీ (Narendra Modi) తన పక్కనే కూర్చొబెట్టుకుని మరీ ముచ్చటించారు. ‘చంద్రబాబు గారు మీరు మాట్లాడండి’ అని సమావేశంలో టీడీపీ అధినేతకు సమయం కూడా కేటాయించారు. దీంతో రెండు నిమిషాలపాటు మోదీ గురించి, సమావేశం విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు టీడీపీ తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోపై టీడీపీ శ్రేణులు, బాబు వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


నాడు.. నేడు..!

చూశారుగా.. నాడు చంద్రబాబును ఎలా చూశారు..? నేడు ఎలా చూస్తున్నారో..? ఇదీ చంద్రబాబు, పసుపు దళపతి రేంజ్ అంటూ టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. నాడు అపాయిట్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి.. నేడు రండి రండి అని పిలిపించుకొని పక్కన కూర్చొబెట్టుకునే వరకూ వచ్చిందంటే దటీజ్ సీబీఎన్ అంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కాగా.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ ఎంపీలు కీలకమనే విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసే టీడీపీ ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని దక్కించుకుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూడా. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీ పెద్దలను పిలిపించిన మోదీ.. ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ పేరుకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ నివాసంలో సుమారు గంటన్నర సేపు జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ ఢిల్లీలో నాడు.. నేడు చంద్రబాబు క్రేజ్.. రేంజ్!!