ఏపీలో ఆర్టీసీ రూపురేఖలు మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు.
అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్సులకు విద్యుత్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టే 1,450 బస్సులూ ఈవీలుగానే ఉండాలన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్ మ్యాప్పై సచివాలయంలో మంగళవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్చాలన్నారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు.
2030 నాటికి దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను మాత్రమే నిర్వహించాలన్నారు. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. అలాగే ఈ బస్సుల మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలన్నారు. స్వయం సమృద్ధి సాధించేలా… రైల్వే శాఖ తరహాలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో రవాణాపై మరింత దృష్టి పెట్టాలన్నారు. అన్ని బస్ స్టేషన్లకు వాణిజ్యపరంగా మరింత ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలన్నారు. మరోవైపు పీఎం – ఈ బస్ సేవా పథకం కింద 750 ఈ-బస్సులు రాష్ట్రానికి అందిస్తోందని, అలాగే తిరుమల-తిరుపతికి మరో 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. చిత్తూరు-వెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు.


































