నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై

www.mannamweb.com


నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్‌ లేఖకు చంద్రబాబు రిప్లై

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన కుటుంబ సభ్యుడు, సినీ నటుడు నారా రోహిత్‌ రాసిన లేఖపై ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన నారా రోహిత్‌, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టే, ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా నిలబడగలిగాను. నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. – ప్రేమతో, నీ పెదనాన్న’’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’ఖాతాలో రిప్లై ఇచ్చారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ రోహిత్‌ పోస్ట్‌ చేసిన లేఖ ఇదే..
‘పెదనాన్న.. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నో ఒడుదొడుకులను చూశారు. తట్టుకున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఎంతో మథనపడ్డారు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్లు అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీ కోసం నిలబడ్డారు.

అప్పుడు తెలిసింది గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని. ఈ ఎన్నికల్లో చరిత్రలో ఎవరూ మళ్లీ తిరగరాద్దాం అనే సాహసం చేయలేని విజయాన్ని అందుకున్నారు. ఆ విజయం ఎన్డీయే కూటమిది మాత్రమే కాదు.. ఆంధ్రా ప్రజలది. తెలుగువారిది. మన అందరిదీ..’’ ఆల్‌ ది వెరీ బెస్ట్‌ అని పేర్కొంటూ రోహిత్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన లేఖను చంద్రబాబు రీట్వీట్‌ చేశారు.