డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. అయినా వరద పరిస్థితిపై వరుసగా సమీక్షలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ ఆయన గురువారం (సెప్టెంబర్ 05) ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు.

వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు.

అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు పవన్ కల్యాణ్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున సీఎం వరద సహాయనిధికి విరాళం అందజేసిన పవన్ కల్యాణ్.. ఏపీలో వరద ప్రభావిత పంచాయతీలకు రూ. లక్ష చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 400 పంచాయతీలకు లక్ష చొప్పున (మొత్తం రూ. 4 కోట్లు) తానే స్వయంగా విరాళం పంపిస్తానని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం వ్యక్తిగతంగా 6 కోట్ల విరాళం అందజేశారు పవన్ కల్యాణ్.