ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు.
విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది తెదేపానే అని గుర్తు చేశారు.
”ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యా శాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ‘ట్రాన్స్ఫర్ యాక్ట్’ తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదు.
గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. మేం వచ్చాక రూ.800 కోట్లు చెల్లించాం. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైకాపా ఆందోళన చేయడం విడ్డూరంగా ఉంది. జగన్ పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు తీరుస్తున్నాం. విద్యార్థులు, టీచర్ల వివరాలను వైకాపా ప్రభుత్వం గందరగోళం చేసింది. విద్యార్థుల సంఖ్య కచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డ్ విధానం, ప్రభుత్వ బడుల్లో డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ తెస్తున్నాం” అని మంత్రి లోకేశ్ తెలిపారు.