బటన్‌ నొక్కి చాలా రోజులైనా నిధులెందుకు జమ చేయలేదు?: ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ

www.mannamweb.com


అమరావతి: నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది. బటన్‌ నొక్కి చాలా రోజులైనా.. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్‌ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది.

ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికల కోడ్‌ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని.. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.