క్షణం లేటైనా, భయపడినా తన కళ్ళముందే తల్లిని కోల్పోయేవాడు. కానీ చురుకుగా ఆలోచించి సకాలంలో ఆ చిన్న పిల్లవాడు స్పందించటంతో ఒక నిండు ప్రాణం నిలబడింది. విద్యుత్ షాక్ తో కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయంలో ఉన్న తల్లిని చూసి తల్లడిల్లి పోయింది ఆ పసి ప్రాణం.. ఎక్కడా అధైర్య పడకుండా సమయస్ఫూర్తితో తల్లిని ప్రాణాలతో కాపాడుకున్నాడు ఆ పసివాడు.. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువులో జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో దీక్షిత్ ఐదవ తరగతిచదువుతున్నాడు. స్కూల్లో మెగా పేరెంట్స్ డే జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు అందరూ మీటింగ్ కు హాజరయ్యారు. దీక్షిత్ తల్లి మీటింగ్ కు వస్తానని చెప్పింది. ఎంత సేపు చూసినా రాకపోవడంతో తల్లిని తీసుకుని రావడానికి పరుగుపరుగున ఇంటికి వెళ్ళాడు దీక్షిత్..
ఇంటికి వెళ్ళే సరికి అతడి తల్లికి కరెంటు తీగ తగిలి విద్యుత్ షాక్ తో కొట్టుమిట్టాడుతుంది. ఇంటి వద్దనున్న మంచినీటి మోటార్ వైరు వల్ల ఆమె విద్యుత్ షాక్ కు గురైంది. విద్యుదాఘాతంతో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి అల్లాడిపోయాడు దీక్షిత్.. తల్లి కొసం వెళ్లి ఆమెను అతను పట్టుకుంటే దీక్షిత్ కూడా ప్రమాదానికి గురయ్యేవాడు. అలా కాకుండా ఎవరినైనా సహాయం కోసం తీసుకుని వద్దామని వెళితే మరింత ఆలస్యం అయ్యు తల్లి ప్రాణాలు పోయేవి.. కానీ, దీక్షిత్ మాత్రం అలా చేయలేదు. సమయస్పూర్తితో ఆలోచించి ముందుగా స్విచ్ ఆఫ్ చేసాడు. ఆ తరువాత తల్లికి తగిలిన కరెంటు తీగను తీసివేసాడు.
వెంటనే తల్లిని పైకి లేపి నెమ్మదిగా డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ ప్రధమ చికిత్స అందించిన తరువాత తల్లితో కలిసి స్కూల్ లో జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కు వెళ్ళాడు. దీక్షిత్ కు ఒక చెల్లి ఉంది. ఆమె మూడోవ తరగతి చదువుతోంది. దీక్షిత్ సమయస్పూర్తికి, ధైర్యానికి తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం తెలిసిన అందరూ దీక్షిత్ సమయ స్ఫూర్తిని అభినందిస్తున్నారు. అంతేకాకుండా.. చిన్నారులకు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.


































