EVM: ఓటీపీతో ఈవీఎం అన్‌లాక్ కాదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం

ఇటీవల మహారాష్ట్రలో ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్‌లాక్‌ చేశారని ఆరోపణలు రావడంతో దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.


ఈవీఎంలను అన్‌లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. అయితే జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ రోజున గోరేగావ్‌ ఎన్నికల కేంద్రంలో.. ముంబయి నార్త్‌వెస్ట్‌ నుంచి బరిలోకి దిగిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్‌ బంధువు మొబైల్ ఫోన్‌ వినియోగించారని ఆరోపిస్తూ.. పలువురు విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కౌంటింగ్ తర్వాత శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఎన్నికల అధికారి మొబైల్‌ఫోన్‌తో ఓటీపీ ద్వారా ఈవీఎం అన్‌లాక్ చేశారనే ఆరోపణలతో.. ఎంపీ రవింద్ర వైకర్, అతని బంధువు మంగేష్ పండిల్కర్‌పై కేసు నమోదైంది.ఈ కేసును విచారించేందుకు ముంబై పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఎవరికి ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఎన్ని ఓటీపీలు వచ్చాయి అనే విషయాలు తెలియల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను అన్‌లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని, ఇవి దేనికి కూడా కనెక్ట్ కావని తేల్చి చెప్పింది.