35 సార్లు ఫెయిల్.. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు.. ఆపై ఐఏఎస్ అధికారిగా.. సక్సెస్‌కు చిరునామా ఇతడే!

IAS Vijay Wardhan : సక్సెస్ ఎవరి సొత్తు కాదు.. పట్టువదలని విక్రమార్కునిలా శ్రమిస్తే ఎవరినైనా సక్సెస్ సలాం కొట్టి దాసోహం అనేస్తుంది. ఇది అక్షరాలా సత్యమని నిరూపించాడో వ్యక్తి.
అతడే ఐఏఎస్ విజయ్ హర్షవర్థన్.. ఓటమి పలుసార్లు అతన్ని చూసి వెక్కిరించినా ఎంతమాత్రం నిరుత్సాహపడలేదు.. అసలు అదరలేదు.. బెదరలేదు.. ఓడినా ప్రతిసారి గోడకు కొట్టిన బంతిలా ఉవ్వెత్తునా లేచి నిలబడ్డాడు. ప్రతి ఓటమిని తన విజయానికి బాటలా పరిచాడు. చివరికి ఐఏఎస్ అధికారి అయ్యాడు. మొదట ఐపీఎస్ అయిన విజయ్.. ఆ తర్వాత ఐఏఎస్ సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు.


విజయ్ సక్సెస్ ఫార్ములా ఇదే…

ఈ స్థాయికి అంత ఈజీగా తానేం రాలేదు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనేకసార్లు ఓటమిని చవిచూశాడు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 35 సార్లు యూపీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అయినా సరే, పట్టువదలని విక్రమార్కునిలా మరింత స్పూర్తితో ముందుకు వెళ్లాడు. చివరికి ఇక అతడికి సాధ్యం కాదు అన్నవారితోనే శభాష్ అనిపించుకున్నాడు విజయ్ హర్షవర్థన్. అతడి సక్సెస్ ఫార్మూలా ఏంటంటే.. ‘నెవర్ ఎవర్ గివ్ అప్’ (Never Ever Give Up).. దీన్ని ఓటమి ఎదురైనా ప్రతిసారి అప్లయ్ చేశాడు. అత్యంత కష్టతరమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఫలితంగా అత్యున్నత శిఖరాన్ని చేరుకున్నాడు. ప్రతిఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. యూపీఎస్ అభ్యర్థులు ఈ కష్టతరమైన ప్రయాణాన్ని కొనసాగించే ముందు తప్పకుండా ఐఏఎస్ విజయ్ వర్థన్ సక్సెస్ స్టోరీ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

35 పరీక్షలు రాసినా ఫలితం శూన్యం :
విజయ్ వర్థన్ హరియాణాలోని సిర్సాకు చెందిన నివాసి. తన విద్యాభ్యాసం ఇక్కడే మొదలైంది. 2013లో హిసార్‌లో ఎలక్ట్రినిక్స్ ఇంజినీరింగ్‌ (బి.టెక్)లో కంప్లీట్ చేశాడు. అప్పుడే అతడిలో సివిల్స్‌లో రాణించాలనే కోరిక కలిగింది. ఐఏఎస్ కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. హరియాణాకు చెందిన పీసీఎస్, యూపీపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, సీజీఎల్‌తో సహా దాదాపు 35 పరీక్షలు రాశాడు. కానీ, ఏ ఒక్క పరీక్షలో కూడా అతడు పాస్ కాలేదు. వరుస ఫెయిలర్స్ వచ్చినా కొంచెం కూడా వెనుకంజ వేయలేదు. 2014లో మొదటి ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత 2018లో వరుసగా నాలుగు పరీక్షలు రాశాడు. అయినా వాటిలోనూ అదే ఓటమి ఎదురైంది.

104 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు.. ఆపై ఐఏఎస్ :
ఇంకా పట్టుదల పెరిగింది. ఈసారి కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. యూపీఎస్సీ ఛాలెంజ్‌ను ధీటుగా స్వీకరించాడు. చివరికి అతడి కఠోర శ్రమకు ఓటమి తలవంచింది. విజయం అతడి ముంగిట నిలిచింది. అదే ఏడాదిలో యూపీఎస్సీ ఫలితాల్లో 104 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. కానీ, అతడి లక్ష్యం ఇది కాదు.. ఐఏఎస్.. అప్పటివరకూ అతడి ప్రయత్నాలు ఆగలేదు. ఐపీఎస్ శిక్షణ కొనసాగిస్తూనే మరోవైపు ఐఏఎస్ కోసం మరింత కఠినంగా చదివాడు. 2021లో తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు. ఐఏఎస్ అధికారి అయ్యాడు. ఎన్నో ఏళ్ల తన కలను సాకారం చేసుకుని మరెందరికో ఆదర్శంగా నిలిచాడు విజయ్ హర్షవర్థన్..