గోదారి ఉగ్ర రూపం.. కొనసాగుతోన్న కోనసీమ జిల్లాలో వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్

www.mannamweb.com


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో వైనతేయ, వశిష్ఠ, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి.

వరద ఉధృతికి కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్ వేలు మునిగిపోయాయి. పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏనుగుపల్లి, తొగరపాయ వద్ద పడవ ద్వారా లంక గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు. కోనసీమకు రెండోసారి వరదలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. వరదలపై అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

మరోవైపు జిల్లాలోని రాజోలు దీవిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. పాశర్లపూడి – అప్పనపల్లి కాజ్వే పై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చాకలిపాలెం – కనకాయిలంక కాజ్వే పై వరద ఉధృతి పెరగడంతో పడవల పైన ప్రయాణం సాగిస్తున్నారు లంకవాసులు.
టేకు శెట్టిపాలెం – అప్పనరాముని లంక కాజ్వే మునిగిపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఆర్డీవో.

ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అమలాపురం ఎంపి గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. వరద ముంపుకు గురైన ఇళ్ళు, పంటపొలాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలతో నదీ కోతకు గురి అవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు ఇప్పటికే 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుండి పెద్ద ఎత్తున నిధులు సేకరించి లంక గ్రామాలను పరిరక్షిస్తామన్నారు.