ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 20% శాతం పెంపు, గ్రాట్యుటీ రూ.4లక్షలకు పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల) ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ప్రభుత్వం వారి జీతాలను ఏకంగా 20శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు పీఏసీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటుగా ప్రతి ఉద్యోగికి సమగ్ర గ్రూప్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద ప్రతి ఉద్యోగికి రూ.5లక్షల కవరేజీ అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం వరాలు ప్రకటించడంతో
పీఏసీఎస్‌ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
అమరావతిలోని సచివాలయంలో పీఏసీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలతో వ్యవసాయంశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయశాఖ ఎక్స్‌అఫీషియో స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్, ఆర్‌సీఎస్‌ అహ్మద్‌బాబు, ఆప్కాబ్‌ ఎండీ రామకృష్ణలు సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పీఏసీఎస్‌ ఉద్యోగుల డిమాండ్లపై చర్చ జరిగింది. ఈ మేరకు ఉద్యోగులకు వరాలు ప్రకటించారు.. ఈ నిర్ణయాలు, మిగిలిన ప్రయోజనాల అమలును త్వరలోనే ఉన్నతస్థాయి కమిటీ ప్రకటిస్తుందన్నారు. ఈ కమిటీ పీఏసీఎస్‌ ఉద్యోగుల ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలిస్తుందని.. అనంతరం ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేస్తుందన్నారు.


పీఏసీఎస్‌ ఉద్యోగులు కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ‘డైనమిక్‌ ఈవోడీ ప్రక్రియలు, పీఏసీఎస్‌ కంప్యూటరీకరణ, డైనమిక్‌ ఈవోడీ ప్రక్రియలు, ఈఆర్‌పీలో రియల్‌టైమ్‌ లావాదేవీలు,హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా జీతాల చెల్లింపు’ వంటి వాటిని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడును పీఏసీఎస్‌ ఉద్యోగులు కలిసి సత్కరించారు. తమ సమస్యల్ని పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

‘సమస్యల పరిష్కారం దిశగా మా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ చర్చలు సఫలం కావడంతో, గత ఏడాది డిసెంబర్ 6 నుండి కొనసాగుతున్న ఆందోళనను విరమించి తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు ఉద్యోగులు ప్రకటించడం శుభపరిణామం. మా ప్రభుత్వం పీఏసీఎస్ ఉద్యోగుల వేతనాలను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వారి గ్రాట్యుటీని రూ. 2 లక్షల నుండి రూ. 4 లక్షలకు పెంచడంతో పాటు, ప్రతి ఉద్యోగికి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీతో కూడిన సమగ్ర గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేయాలని నిశ్చయించాం’ అని తెలిపారు.

‘ఈ ప్రయోజనాల అమలుకు సంబంధించిన విధివిధానాలను ఉన్నత స్థాయి కమిటీ త్వరలోనే వెల్లడిస్తుంది. పీఏసీఎస్ కంప్యూటరైజేషన్, ఈఆర్పీ (ERP) లావాదేవీలు, హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్ (HRMS) ద్వారా జీతాల చెల్లింపు వంటి ఆధునిక ప్రక్రియల్లో ఉద్యోగులు చూపుతున్న నిబద్ధత అభినందనీయం. రాష్ట్ర వ్యవసాయాభివృద్ధిలో, సహకార బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పీఏసీఎస్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. ముఖ్యమంత్రి చంద్రబాబుగారి నేతృత్వంలోని మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హెచ్‌ఆర్ (HR) పాలసీని తీసుకురావడం జరిగింది, నేడు అదే బాధ్యతతో వారి వేతనాలను పెంచడం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. ఉద్యోగుల మిగిలిన డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తుంది. రైతన్నలకు మరింత ఉత్సాహంతో సేవలు అందించాలని, సహకార రంగాన్ని అగ్రపథంలో నిలపాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.