ఆటో,క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్… ఖాతాలో రూ.15వేలు… ఎప్పుడు వేస్తారు, అర్హులు , పూర్తి వివరాలు

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలుపై ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలు చేయనున్నట్లు తెలిపింది.


ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.’డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసు కాబట్టే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ఈ నెల 4న ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నాం.ఒక్కో ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం ఇస్తాం. దాదాపు 2.90 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా గుర్తించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.’ ఆటో డ్రైవర్ సేవలో పథకం అమలుకు ఏడాదికి రూ.435 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి ఒక్కో రైతుకూ రూ.20,000 ఇస్తున్నాం. సూపర్ సిక్స్ లో మొదటి హామీ మెగా డీఎస్సీ. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెట్టి ఏడాదికే టీచరు పోస్టులు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు నేను అండగా ఉంటాను. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇప్పటికే 5,500 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు
2029 నాటికల్లా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని… వచ్చే ఏడాది జూన్ కల్లా మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.’రాష్ట్రంలో అందరి ఆకలి తీర్చేలా 204 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ పాలసీ త్వరలో తీసుకువస్తున్నాం. అందరికీ రూ.2.5 లక్షలు మేర ఆరోగ్య బీమా అందిస్తాం. దీంతో రాష్ట్రంలోని 1.63 కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది. పేదలకు రూ.25 లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తాం. జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేలా ధరలు తగ్గి కొనుగోలు శక్తి పెరిగింది. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.8 వేల కోట్లు తగ్గుతుంది. అయినప్పటికీ జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ శాసన సభలో తీర్మానం చేశాం. కారణం…పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుంది అనేది మా ఆలోచన. కొత్త శ్లాబుల వల్ల ప్రతి కుటుంబానికి…ప్రతినెలా రూ.1000 నుంచి రూ.1500 వరకు ఆదా అవుతుంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

భవిష్యత్ లోనూ కరెంటు చార్జీలు పెంచబోం

ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గించే చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.’సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. దేశ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్ తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తున్నాం. నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసలు తగ్గుతాయి.పీఎం కుసుమ్ స్కీంలో భాగంగా రైతులకు, పిఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు గరిష్టంగా రూ.98 వేలు సబ్సిడీ ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత నాది

ఉత్తరాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నాం. గత పాలకుల వల్ల భోగాపురం ఎయిర్ పోర్టు ఆలస్యమైంది. 2026 ఆగస్టు నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం. విజయనగరం పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా. వంశధార, నాగావళి, తోటపల్లి, తారకరామ తీర్ధసాగర్ సహా అనేక ప్రాజెక్టులు మేమే ప్రారంభించాం. రాబోయే రెండేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేయడం వల్ల నీటి ఎద్దడి తీరుతుంది. రూ.25 కోట్ల వ్యయంతో సార్వగడ్డ మినీ రిజర్వాయర్ రెండేళ్లలోగా పూర్తిచేసి నీరు అందిస్తాం. మత్స్యకారులకు జెట్టీ కట్టిస్తాం. శాసనాపల్లికి హై లెవల్ బ్రిడ్జ్ మంజూరు చేస్తాం. మర్రివలస నుంచి గజపతినగరం వరకూ నూతన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. అటు విశాఖ నగరానికి టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలోనే ట్రైబల్ యూనివర్సిటీ కూడా నిర్మాణమవుతోంది. రూ.1.47 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. విశాఖ, రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో దేశమంతటా రవాణాకు కనెక్టివిటీ మెరుగవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

శ్రీవారి ఆశీస్సులతో ముందుకు

‘నాపై 24 క్లైమోర్ మైన్స్ పేల్చితే… సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టాడు. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తాను. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రాణదానం ట్రస్ట్ కింద రూ.688 కోట్ల నిధులను సమీకరించి తిరుపతిలో ఉండే ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.’రాష్ట్రంలో 17 లక్షల శ్రీవారి సేవకులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయంటే అందులో సేవకుల కృషి కూడా ఉంది. విదేశాల్లో ఉంటున్న మన తెలుగు డాక్టర్లు ఓ వారం రోజులు తిరుపతిలో పేదలకు వైద్యం చేసి శ్రీవారి దర్శనం చేసుకోమని నేను పిలుపునిచ్చాను. దేశవ్యాప్తంగా 5 వేల శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నాం. అలాగే మసీదులు, చర్చిలు కట్టుకోవడానికి ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

గతంలో పాలకులు వస్తున్నారంటే పరదాలు కట్టేవారని, సభకు వచ్చినవాళ్లు వెళ్లకుండా గోతులు తవ్వేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.గత ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. ‘2024లో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చింది. కొన్ని పార్టీలకు మంచి పనులు చేయడం రాదు. ఇతరులు చేస్తే తట్టుకోలేరు. అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేస్తారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారు. అలాంటి వారి ఆటలు సాగవు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే అదే వారికి చివరిరోజవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.