దుర్గగుడిలో సేవ చేయాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆన్‌లోనే రిజిస్టేషన్‌

విజయవాడలోని అమ్మవారి ఆలయంలో భక్తి తత్వంతో సేవ చేయాలనే వారికి, భక్తి బృందాలకు సేవ చేసేందుకు వీలుగా దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరైతే భక్తులు అమ్మవారి ఆలయంలో సేవ చేద్దామని భావిస్తున్నారో వారు తమ పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవడానికి దుర్గగుడి అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఇంద్రకీలాద్రి క్షేత్రం దుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగించనున్నారు. భక్తులుకు త్రాగు నీరు అందించడం, అన్న ప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, భక్తుల ఫీడ్ బ్యాక్ కౌంటర్, లిప్ట్ క్యూ వద్ద, దేవస్థానం బస్ క్యూ వద్ద, పార్కింగ్, టోల్ గేట్ వద్ద వాహనాలు క్రమబద్దీకరణ తదితర చోట్ల సేవకుల, భక్త బృందాల సేవలు ఆలయ అధికారులు వినియోగిస్తారు. ఇప్పటివరకు కేవలం తిరుపతిలోనే ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడూ తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా ప్రారంభించారు.


రిజిస్టర్ చేసుకొనే విధానం

ఇలా సేవ చేయడానికి వచ్చే సేవకులు మొదటగా దేవస్థానం వెబ్ సైట్ www.kanakadurgamma.orgలో వాలంటీర్ విభాగంలో వాలంటీర్‌గా జాయిన్ అయ్యి తమ పేరు, ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా, ఫోటో, ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకులకు సేవ ఎప్పుడు కేటాయించారు, ఎన్ని రోజులు, వసతి, అన్న ప్రసాదం, లాకర్ సౌకర్యం, సేవకులకు తాత్కాలిక గుర్తింపు కార్డు, వసతి నుండి దేవస్థానంకి రవాణా సదుపాయాల వివరాలు అన్ని మెసేజ్ రూపంలో అందేలా పారదర్శకంగా వ్యవస్థ ఏర్పాటు చేశారు. భక్తి భావంతో అర్హత కలిగిన వ్యక్తులను సేవకు ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.