ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఏపీలో ఆహారశుద్ధి పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధమైంది.
పచ్చళ్ళు, పిండివంటలు, పశువుల దాణా వంటి పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలను ఇస్తోంది.
సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ చర్య
కేవలం 10 శాతం పెట్టుబడి పెడితే మిగతా పెట్టుబడిని ప్రభుత్వమే ఋణం కింద ఇచ్చి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తుంది. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పైన 35 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఈ పథకం కింద గరిష్టంగా 10 లక్షల వరకు రాయితీని పొందవచ్చు.
డ్వాక్రా మహిళలకు రుణాలపై రాయితీ
అయితే ఇందులో డ్వాక్రా మహిళలు రుణం తీసుకుని 35% రాయితీ పైన తమ యూనిట్ ను విస్తరించుకునే అవకాశం ఉంటుంది. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారం చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో 5 లక్షలలోపు పరిశ్రమలు పెట్టాలనుకుంటే పచ్చళ్ళు, పొడులు, చిప్స్, కేకులు, అప్పడాలు, ఇడ్లీ , దోశ పిండి తయారీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి యూనిట్లను పెట్టుకోవచ్చు.
ఈ పెట్టుబడులతో ఈ ఆహార శుద్ధి పరిశ్రమలు
ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల పెట్టుబడితో ఆహార శుద్ధి యూనిట్లు పెట్టాలనుకుంటే నూనెల తయారీ, కెచప్ ల తయారీ, సాస్, జెల్లీ, పప్పు మిల్లులు, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా కాస్త ఎక్కువ పెట్టుబడి తో 10 నుండి 20 లక్షల రూపాయల వరకు పెట్టాలనుకుంటే పన్నీర్, జామ్, చీజ్, చాక్లెట్స్, పశువుల దాణా, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ తదితర యూనిట్ లను పెట్టవచ్చు.
వివరాలకు ఇలా చెయ్యండి
ఇక ఈ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునేవారు ఏర్పాటు చేయాలనుకున్న యూనిట్ వివరాలతో ఆన్లైన్లో వెబ్సైట్ https:///pmfmeap.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా మరియు మండల స్థాయిలో ఉన్న అధికారులను అడిగి వివరాలను తెలుసుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఇటువంటి పథకాలు మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి.
































