ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు..


నేతన్న భరోసా పథకంపై ప్రకటన చేశారు. ‘నేతన్న భరోసా’ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సాయంతోపాటు చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు మరిన్ని రాయితీలు, ఉచితాలు కూడా ఈ సభ నుంచే వెల్లడించారు. రాష్ట్రానికి కీలకంగా ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తోపాటు, మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువమంది ఆధారపడే చేనేత పరిశ్రమ.. భారతదేశ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయాలకు చిహ్నమని కొనియాడారు. మన చేనేత పరిశ్రమ నైపుణ్యం, సృజనాత్మకత కలగలిసి ఉంటుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ.. తనకు మొదట గుర్తుకువచ్చేది చేనేత కార్మికులేనని చంద్రబాబు తెలిపారు. నేతన్నలు నేసే దుస్తులపై 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా నేతన్నలకు ఇచ్చిన రూ.110 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. వీటి వల్ల మంగళగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ ప్రాంతాల్లో 1374 మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. చేనేత ఆదరణ 3 కింద ఇంకొన్ని కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.