ఏపీలో తెల్లరేషన్ కార్డు దారులకు శుభవార్త

ఏపీలో తెల్లరేషన్ కార్డు దారులకు శుభవార్త


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెలిసింది. రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు. ఖచ్చితంగా కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపారు. ఈనెల 20 నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది.

పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్
పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో అంతే రంగంలోకి దిగిపోయారు. దుకాణాలను తనిఖీలు చేపట్టారు. అనంతరం కందిపప్పు రావడం లేదని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.