వైద్య నివేదికల ప్రకారం.. ఆహార నియమాలు పాటించకపోవడం, జీవనశైలి సమస్యలు, పర్యావరణ మరియు జన్యుపరమైన కారణాలు ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
దశాబ్దం క్రితం వరకు క్యాన్సర్ అంటే మరణమే అని భావించేవారు. కానీ, వైద్య రంగంలో వచ్చిన ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ పరిశోధనల వల్ల ఇప్పుడు వ్యాధిని ముందుగా గుర్తించడమే కాకుండా, రోగులు త్వరగా కోలుకుంటున్నారు. క్యాన్సర్ చికిత్సలో ‘బయోసిమిలర్’ (Biosimilars) మందులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి బ్రాండెడ్ మందుల వలె పనిచేస్తాయి, కానీ తక్కువ ధరకే లభిస్తాయి.
ప్రపంచంలోనే మొట్టమొదటి బయోసిమిలర్ ‘తిష్టా’ (Tishta)
ప్రముఖ ఔషధ సంస్థ జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) గురువారం (జనవరి 22, 2026) క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేలా ఒక ప్రకటన చేసింది. ‘నివోలుమాబ్’ (Nivolumab) అనే మందు కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి బయోసిమిలర్ను ‘తిష్టా’ అనే పేరుతో భారత్లో విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
- ఏమిటీ నివోలుమాబ్? ఇది ఒక ఇమ్యునోథెరపీ మందు. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తుంది.
- ధరల వ్యత్యాసం: ప్రస్తుతం మార్కెట్లో నివోలుమాబ్ 100 mg ధర ₹50,000 నుండి ₹1,00,000 వరకు ఉంది. కానీ జైడస్ విడుదల చేసిన ‘తిష్టా’ ధరలు చాలా తక్కువ:
- 100 mg మోతాదు: ₹28,950
- 40 mg మోతాదు: ₹13,950
అంటే ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది దాదాపు నాలుగో వంతు (1/4th) ధరకే లభిస్తోంది.
5 లక్షల మందికి పైగా ప్రయోజనం
జైడస్ లైఫ్ సైన్సెస్ ఎండీ షార్విల్ పి. పటేల్ మాట్లాడుతూ.. “తిష్టా విడుదలతో క్యాన్సర్ రోగులకు ఇమ్యునో-ఆంకాలజీ చికిత్సను మరింత చేరువ చేస్తున్నాము. రోగులకు నాణ్యమైన చికిత్సను తక్కువ ధరకే అందించడమే మా లక్ష్యం. దీనివల్ల సుమారు 5,00,000 మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాము” అని తెలిపారు.
అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల మధ్యతరగతి మరియు పేద వర్గాల క్యాన్సర్ రోగులకు చికిత్స భారం గణనీయంగా తగ్గనుంది.

































