ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.


లక్ష 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సర్కార్‌ ఆమోదం తెలిపింది. లేటెస్ట్‌గా ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్స్‌కు క్యాప్టివ్‌ పోర్ట్‌ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనకాపల్లిలోని డీఎల్‌పురంలో పోర్ట్‌ను కేటాయించింది. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించనున్నారు. 2029 జనవరినాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

రెండో దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పుతారు. దీనిలో 2033 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తారు. రెండో దశలో 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.మిట్టల్‌ స్టీల్‌ ఇండియా కంపెనీ ప్రతినిధుల అభ్యర్థన మేరకు డీఎల్‌ పురం వద్ద 2.9 కిలోమీటర్ల వాటర్‌ ఫ్రంట్‌తో క్యాప్టివ్‌ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి అనుమతుల కోసం కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు సంబందించిన రాయితీ ఒప్పందాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.5,816 కోట్ల అంచనా వ్యయంతో ఏటా 20.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇది 2029నాటికి అందుబాటులోకి ఇక్కడ వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో దశలో దీన్ని మరింతగా విస్తరిస్తారు.