ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తమకు తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగా ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోఅపోలో ఆస్పత్రి సోమవారం విడుదల చేసిన ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025’ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 పేరిట అపోలో హాస్పిటల్స్ ఐదవ ఎడిషన్ని విడుదల చేసింది. ఇందులో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. “లక్షణాల కోసం ఎదురుచూడకండి.. నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా చేసుకోండి” అనే మెసేజ్తో ఈ నివేదికను విడుదల చేశారు అపోలో. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఆరోగ్యాన్ని పరీక్షించి దీన్ని రూపొందించారు.
ఇదో నిశబ్ధ మహమ్మరి
ఈ నివేదిక ఒక నిశ్శబ్ద మహమ్మారి గురించి వెల్లడించింది. అయితే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ లక్షల మంది తెలియకుండానే వివిధ రకాల వ్యాధులతో జీవిస్తున్నారని తెలిపింది. ఈ నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. 26% మంది రక్తపోటు సమస్యతో, 23% మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు తేలింది. ఆరోగ్య పరీక్షలు జరిపిన వారిలో 66% మందికి కొవ్వు కాలేయం సమస్యలు ఉండగా.. వారిలో 85% మంది మద్యానికి దూరంగా ఉన్నారని నివేదిక తెలిపింది.అయినప్పటికీ వారికి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. 2019లో 10 లక్షల మంది ఆరోగ్య పరీక్షలు చేసుకోగా 2024లో 25 లక్షల మంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
25 లక్షలమందికిపైగా పరీక్షలు:
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆస్పత్రుల్లో 25 లక్షలమందికిపైగా వ్యక్తులకు చేసిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. అయితే ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు అపోలో ఆస్పత్రుల్లో 44,448 మందికి పరీక్షలు చేయగా.. వారిలో 10,427 మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు తేలింది. మరో 24,246 మంది ప్రీహైపర్టెన్షన్ దశలో ఉన్నట్టు తేలింది. అలాగే.. 40,897 మందికిగాను 10,355 మంది మధుమేహ బాధితులు ఉండగా.. డయాబెటిస్ రావడానికి ముందు దశలో ఏకంగా 14 వేల మంది ఉన్నారని నివేదిక తెలిపింది. ఇక.. పరీక్షలు చేయించుకున్నవారిలో 63 శాతం మంది ఊబకాయంతో ఉండగా,19 శాతం మంది అధికబరువుతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. డిస్లిపిడెమియాతో బాధపడుతున్నవారు 47శాతం మంది ఉన్నారు. కుంగుబాటు, వ్యాకులత వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు చెరో 3 శాతం మంది ఉన్నట్టు నివేదికలో తేలింది.
49 శాతం మందికి ఫ్యాటీ లీవర్ సమస్య:
ఇక కాలేయ సంబంధిత పరీక్షలు 32,333 మందికి చేయగా.. వారిలో 49 శాతం మంది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మరో 5 శాతం మంది రెండో దశ ఫ్యాటీ లివర్తో.. 80 మంది గ్రేడ్ 3, ఆరుగురు గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. నిత్యం కాసేపు ఎండలో ఉంటే ఉచితంగా వచ్చే డి విటమిన్ లోపంతో బాధపడుతున్నవారు ఏకంగా 82 శాతం మంది ఉన్నట్లు తేలింది.