బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ తర్వాత అది వాయుగుండంగా బలపడి, శనివారం నాటికి తీరం దాటొచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్, ఇతర వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.


దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవొచ్చని భావిస్తున్నాయి. మరోవైపు రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వైఎస్సార్‌ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి. సోమవారం పల్నాడు, తూర్పుగోదావరి, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బాపట్ల తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.