నీ కూతురుకు పెళ్లి..ఇతర మహిళలకు సన్యాసమా? జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు ప్రశ్న.

www.mannamweb.com


ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు మద్రాస్ హైకోర్టు ఇవాళ ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది. ఆయన నడుపుతున్న ఈషా యోగా కేంద్రంలో బాగా చదువుకున్న తమ కుమార్తెలను శాశ్వతంగా ఉంచేలా సద్గురు బ్రెయిన్ వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది.

తన సొంత కుమార్తెకు పెళ్లి చేసి, ఇతరుల కుమార్తెలను సన్యాసినులుగా మారేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సద్గురును ప్రశ్నించింది.

కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎస్ కామరాజ్.. తన కుమార్తెలను సద్గురు జుత్తు కత్తిరించుకుని, ప్రాపంచిక జీవితాలను త్యజించాలంటూ ప్రోత్సహించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సద్గురు ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెలను హైకోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

వాస్తవానికి నిన్న కోర్టుకు హాజరైన 42, 39 ఏళ్ల ఇద్దరు మహిళలు తమ ఇష్ట ప్రకారమే సద్గురుకు చెందిన ఇషా ఫౌండేషన్‌లో ఉంటున్నామని, తమను ఎవరూ నిర్బంధించలేదని కోర్టుకు తెలిపారు. దశాబ్దాల నాటి కేసులో తమ తల్లిదండ్రులు తమ జీవితాలను వదిలేసి నరకప్రాయంగా మార్చారని పేర్కొన్నారు.

దీంతో ఈ కేసును లోతుగా విచారించాలని జడ్జీలు నిర్ణయించారు. ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగానే తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి (సద్గురు) ఇతరుల కూతుళ్లను తల దించుకుని సన్యాసి జీవితాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలని జస్టిస్ శివజ్ఞానం తెలిపారు..