లగ్జరీ నుంచి బడ్జెట్ వరకు బంపర్ సేల్స్డీలర్లకు 2025లో 44,89,717 యూనిట్ల సరఫరా2024తో పోలిస్తే గతేడాదిలో 5 శాతం వృద్ధి ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్ వెల్లడి
వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్యూవీ) సరఫరాలు గతేడాది(2025)లో 5% పెరిగి 44,89,717కు చేరాయని ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్ మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ సంస్కరణల వల్ల ధరలు తగ్గడంతో, పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగా జరిగాయి. తద్వారా వాహన సరఫరాలు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. అంతకు ముందు 2024లో ఈ సరఫరా 42,74,793 యూనిట్లుగా ఉన్నాయి.
విభాగాల వారీగా ఇలా…
యుటిలిటీ వాహనాలు డిస్పాచ్లు 27,49,932 నుంచి 7% వృద్ధి చెంది 29,54,279కు చేరాయి.
ప్రయాణికుల టోకు విక్రయాలు స్వల్పంగా 1% పెరిగి 13,79,884 యూనిట్లకు చేరాయి.
త్రీ వీలర్స్ డిస్పాచ్లు 8% ఎగసి 7,28,670 నుంచి 7,88,429 యూనిట్లకు చేరాయి
వాణిజ్య వాహన విక్రయాలు 8% వృద్ధి సాధించి 10,27,877 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, 2024లో విక్రయాలు 1,95,43,093గా ఉన్నాయి.
ద్వి చక్రవాహన అమ్మకాలు 5% వృద్ధితో 2,05,00,639 యూనిట్లకు చేరాయి.
”భారత ఆటోమొబైల్ పరిశ్రమకు 2025 ఏడాది కీలక మైలురాయిగా నిలిచింది. ప్రథమార్ధమంతా సప్లై, మందగమనం సవాళ్లు ఎదుర్కొంది. తదుపరి ఆదాయపు పన్ను రాయితీ, ఆర్బీఐ వరుస రెపో రేట్ల కోత, జీఎస్టీ 2.0 అమలు సెంటిమెంట్ మెరుగుపడింది” సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వాహన ధరలు మరింత చౌకగా మారి, పరిశ్రమను పరుగులు పెట్టించాయి. ప్యాసింజర్, కమర్షియల్, సీవీ, త్రీ వీలర్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి విక్రయాలు 2025లో జరిగాయన్నారు. 2024తో 2025లో ఎగుమతులు సైతం రెండంకెల వృద్ధి సాధించాయన్నారు.
ఈ ఏడాది(2026) అవుట్లుక్పై శైలేష్ చంద్ర వివరణ ఇస్తూ .., స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, అందుబాటు ధరల్లో వాహన లభ్యత, ప్రభుత్వ విధానాల కొనసాగింపు అంశాలతో ఈ ఏడాదిలో డిమాండ్ తగ్గట్లు సరఫరా ఉండొచ్చని అంచనా వేశారు. సప్లై చైన్ స్థిరత్వం, ఎగుమతుల వ్యాల్యూమ్స్(పరిమాణం) ప్రభావితంకాకుండా భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు.
డిసెంబర్లో వాహన టోకు విక్రయాలు: గతేడాది డిసెంబర్ వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు 26,33,506 యూనిట్ల ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్యూవీ) సరఫరా అయ్యాయి.


































