వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం? పార్టీ నేతలతో జగన్‌

www.mannamweb.com


అమరావతి: ‘వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం.. విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలి. వెళ్లేవారు వెళతారు.

బలంగా నిలబడగలిగేవారే నాతో ఉంటారు. పార్టీలో నేను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చాం. ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం. ఇబ్బందేమీ లేదు’ అని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘శాసనమండలిలో వైకాపాకు సంఖ్యా బలం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు, ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయి’ అని ఇటీవల పార్టీ నేతలతో జగన్‌ అన్న మాటలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. జగన్‌ స్పందిస్తూ..

‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. వాళ్లలో ఎంత మంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు? అటూ ఇటూ వెళ్లేవారు ఎటూ కాకుండా పోతారు. ఎవరిష్టం వారిది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా.. వెనక్కి తగ్గకూడదు, మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు.