‘ఎగ్​ నూడుల్స్​ కావాలి’- జైలు భోజనంపై సంజయ్​ రాయ్​ కోపం

www.mannamweb.com


కోల్​కతా వైద్యురాలి హత్య, మర్డర్ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ జైలు భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సబ్జీ-రోటీకి బదులు ఎగ్​ నూడుల్స్​ కావాలని డిమాండ్ చేశాడని సమచారం.

కోల్​కతాలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్ జైలులో వడ్డించిన భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్​లో ఉన్న సంజయ్​ రాయ్.. అక్కడ అందించే ప్రామాణిక ‘సబ్జీ-రోటీ’ (చపాతీ- కూర) భోజనానికి బదులు ఎగ్​చౌమీన్​ను అందించాలని డిమాండ్ చేశాడని సమచారం.

ఈ వార్తను హెచ్​టీ తెలుగు స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. కాగా ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ప్రకారం.. తనకు సబ్జీ-రోటీ వడ్డించినప్పుడు సంజయ్​ రాయ్ కోపంగా ఉన్నాడని, అయితే జైలు సిబ్బంది మందలించడంతో చివరకు భోజనం తిన్నాడని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ వర్గాలు తెలిపాయి. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలందరికీ ఒకే రకమైన ఆహారం అందాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.
లై డిటెక్షన్ టెస్ట్ సందర్భంగా సంజయ్ రాయ్ వాంగ్మూలం..

మరోవైపు కోల్​కతా వైద్యు రాలి హత్య కేసు నిందితుడు సంజయ్​ రాయ్​పై లై డిటెక్షన్​ టెస్ట్​ జరిగిన విషయం తెలిసిందే. బాధితురాలిని చూసిన సమయానికే ఆమె చనిపోయిందని, భయంతో అక్కడి నుంచి పారిపోయానని సంజయ్​ రాయ్​ చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ జరుగుతున్నంత సేపు రాయ్ ఆందోళనకు గురైనట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. లై డిటెక్టర్ పరీక్షలో అనేక నమ్మశక్యం కాని సమాధానాలు వెల్లడయ్యాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

పోలీసు విచారణంలో తొలుత నేరాన్ని అంగీకరించిన నిందితుడు సంజయ్​ రాయ్​.. అనంతరం తాను ఎలాంటి తప్పు చేయాలేదని, తనని ఇరికిస్తున్నారని కోర్టులో చెప్పడం సర్వత్రా చర్చకు దారితీసింది.

అయితే బాధితురాలి తల్లిదండ్రులకు.. కోల్​కతా వైద్యురాలి హత్యను పోలీసులు తొలుత ఆత్మహత్యగా చెప్పినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్​ ఇప్పుడు వైరల్​ అయ్యింది. వాటిని పరిశీలించనట్టు, ఘటనను ఆత్మహత్యగా చెప్పలేదని కోల్​కతా పోలీసు ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఆత్మహత్య అని ఎప్పుడూ చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​కి చెందిన 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య కేసును ప్రస్తావిస్తూ..

“కోల్​కతా పోలీసులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ పలు ఛానళ్లు ప్రసారం చేసిన కొన్ని ఆడియో క్లిప్పింగులు విన్నాం. ఇది ఆత్మహత్య అని తాము ఎప్పుడూ చెప్పలేదు,” అని సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఇందిరా ముఖర్జీ తెలిపారు.
దిల్లీలో ఫైమా శాంతియుత నిరసన..

కోల్​కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) నేడు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టనుంది.

“ఈ హేయమైన చర్యతో ఫైమా తీవ్రంగా కలత చెందింది. ఇది వైద్య వర్గాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా, ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పరిస్థితులను బహిర్గతం చేసింది,” అని అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఫైమా వ్యవస్థాపకుడు, ప్రధాన సలహాదారు మనీష్ జంగ్రా తెలిపారు.