ప్రారంభోత్సవాలకు వస్తాను.. డబ్బులు ఇవ్వాలి : కేంద్ర మంత్రి సంచలన ప్రకటన

మీ షాపు.. షాపింగ్ మాల్ ఏదైనా సరే.. మీ వ్యాపారాన్ని నా చేతులతో ప్రారంభించాలి అంటే వస్తాను.. అంతేనా మీ వ్యాపారాలకు ప్రమోషన్ కావాలంటే చేసి పెడతాను..


కాకపోతే డబ్బులు ఇవ్వాలి.. మిగతా వాళ్లకు ఎంత ఇస్తారో అంత నాకూ ఇవ్వాలి అంటూ సంచలన ప్రకటన చేశారు హీరో సురేష్ గోపీ.. ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, గ్యాస్ శాఖ మంత్రి. మళయాళంలో మోస్ట్ సీనియర్ హీరోగా వెలుగొందిన సురేష్ గోపి.. రాజకీయాల్లోకి వచ్చి.. కేరళ రాష్ట్రంలోనే మొదటిసారి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి.. గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు.

ఇటీవల సురేష్ గోపీపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఆయన స్పందించారు. నేను మొదట హీరోను.. నాకు ఉన్న విలువను వ్యక్తిగతంగా ఉపయోగించుకుని ప్రారంభోత్సవాలు చేస్తాను.. ఊరికే చేయను.. డబ్బులు ఇవ్వాలి అని చెప్పటాన్ని సమర్థించుకున్నారు. అలా వచ్చిన డబ్బులను నా సొంతానికి ఉపయోగించుకోని.. ట్రస్టుకు వెళతాయి.. ఆ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాను అని వెల్లడించారాయన. అంతేకాదు.. కేంద్ర మంత్రిగా నాకు వచ్చే జీతంలో.. 5 నుంచి 8 శాతం డబ్బులను ట్రస్టులకు ఇస్తున్నానని కూడా స్పష్టం చేశారు.

ఎంపీగా.. కేంద్ర మంత్రిగా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఖర్చు చేస్తానని.. వ్యక్తిగతంగా ఎవరికీ డబ్బులు ఇవ్వనని కూడా వెల్లడించారాయన. 2024, జూలై 4వ తేదీ సాయంత్రం.. గురువాయూర్ నియోజకవర్గం బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్న సురేష్ గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

హీరోగా ఉన్న పాపులారిటీని మాత్రమే ఉపయోగించుకుని ప్రారంభోత్సవాలకు వెళతానని.. మిగతా హీరోలకు, హీరోయిన్స్ కు ఎంత అయితే డబ్బులు ఇస్తారో అంతే ఛార్జ్ చేస్తానని.. అలా వచ్చే డబ్బులను ట్రస్టుకు ఇస్తానని చెప్పి సంచలనం రేపారు. మొత్తానికి సురేష్ గోపీ భిన్నంగా.. విభిన్నంగా ఆలోచిస్తున్నారని.. మంచి పని చేస్తున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇంకా హీరోగానే ఆలోచిస్తే ఎలా.. ఇప్పుడు కేంద్ర మంత్రి కదా అంటున్నాయి విపక్ష పార్టీలు.