దేశ వ్యాప్తంగా త్రిభాషా విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనదైన శైలిలో స్పందించారు. స్పందిస్తున్నారు కూడా. దీంతో కేంద్రం వర్సెస్ తమిళనాడు రాష్ట్రం అన్నట్లుగా పరిస్థితి మారింది. అలాంటి వేళ.. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంగళవారం అమరావతిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కానీ కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
దేశంలో త్రిభాషా విధానం అమలు చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. అయితే ఈ విధానం వల్ల మాతృభాషకు మరుగున పడే అవకాశముందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా..దీనిని అడ్డుకునేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేపట్టారు. ఆందులోభాగంగా తమిళనాడుకు చెందిన ఎంపీ పార్లమెంట్లో నల్ల టీ షర్ట్ ధరించి.. తన నిరసన తెలియజేశారు. ఇక హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దితే సహించబోమని ఇప్పటికే తమిళనాడులోని పార్టీలన్నీ ఏకమైన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాము ద్వి భాష విధానానికే కట్టుబడి ఉంటామని సదరు పార్టీలు ప్రకటించాయి.
ఇంకోవైపు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10వ తేదీన ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై పార్లమెంట్ను ప్రతిపక్షాలు స్తంభింప చేస్తున్నాయి. వాటిలో త్రి భాషా విధానం ఒకటన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో యువత.. విదేశీ భాషలను నేర్చుకునేందుకు తీవ్ర ఆసక్తి కనబరుస్తోంది. ఆ క్రమంలో జపాన్, జర్మనీ, స్పానిష్ తదితర భాషలను నేర్చుకుంటున్నారు. అలాంటి వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో సైతం అధికంగానే ఉంది. అలాంటి వేళ.. ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పై విధంగా స్పందించారు.