Chandrababu: పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..
‘‘పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి’’

రాష్ట్రానికి శాపంగా జగన్‌..
‘‘రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు’’

‘‘ఈ ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్సీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.